తాండూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
తాండూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాలు జరిగాయి. మంగళవారం తాండూర్ పట్టణంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి న్యాయవాదులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కురువ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే అణగారిన పీడిత ప్రజల జీవితాలు ఊహించడం కష్టమని అన్నారు. మధ్యప్రదేశ్ లో జన్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తే కూర్చోవడానికి స్థలం ఇవ్వని సన్నివేశం నుండి దాదాపు 35 డిగ్రీలు పొంది కసిగా అనగారిన వర్గాలను అభివృద్ధి పథంలో నడిచే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. ప్రపంచ మేధావి భారతరత్నగా పేరుపొందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శమని కురువ శ్రీనివాస్ అన్నారు. ఎన్నో అవమానాలు పొందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ స్థితి గతులను మార్చిన వ్యక్తి ఒక శక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి జయంతిని ఘనంగా జరుపుకోవడం ప్రతి ఒక్క భారతీయుని లక్షణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పాశం రవికుమార్, కోశాధికారి ఎండి మస్తాన్ అలీ, న్యాయవాదులు నర్సింగ్ రావు, గోపాల్, వై. విశ్వనాథ్, బందెప్ప, నరసప్ప, కమలాకర్, కె విశ్వనాథ్, ఆనంద్ కుమార్, సుదర్శన్ మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
